Tuesday, September 2, 2008

వినాయకుడి గజాననుని కథ

శివపార్వతుల ప్రథమ కుమారుడు వినాయకుడు. సర్వవిజ్ఞాలను తొలగించే దేవునిగా వినాయకుడు ప్రఖ్యాతి గాంచాడు. ఏ కార్యక్రమాన్ని అయినా ప్రారంభించే ముందు వినాయకుని పూజించడం హిందూవుల ఆనవాయితీ. ఈ వినాయక చవితి వేడుకలను పది రోజుల పాటు అతి వైభవంగా నిర్వహిస్తారు.కుమారస్వామి వలె వినాయకుడు పార్వతీ దేవి గర్భం నుంచి జన్మించలేదు. ఒక నాడు కైలాసంలో పార్వతీ దేవీ నలుగు పెట్టుకుని స్నానం చేస్తోంది. ఆ సమయంలో ఏమీ తోచక నలుగు పిండితో చిన్న బొమ్మను తయారు చేసింది. పార్వతీ దేవీ చెలికత్తె ఆ బొమ్మను చూసి బొమ్మ ముద్దుగా ఉందమ్మా ప్రాణం పోస్తే బాగుంటుందని అన్నది. దీంతో ముచ్చటపడిన పార్వతీ దేవీ ఆ బొమ్మను బ్రహ్మ వద్దకు తీసుకెళ్లి ప్రాణం పోయించి తీసుకురమ్మని చెలికత్తెలను పంపింది.అలా ప్రాణం పోసుకున్న ఆ బాలుడిని ఆమె స్నానాల గది బయట కాపలాకు పెట్టింది. ఆభరణాలను అలంకరించుకుని ఆమె భర్త రాకకై నిరీక్షించసాగింది. ఈ విషయం తెలియని పరమశివుడు పార్వతీ దేవీ మందిరంలోకి ప్రవేశించబోగా, ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆశ్చర్యపోయిన శివుడు ఎవరు నీవని ప్రశ్నించాడు? లోనికి ప్రవేశము లేదని ఆ బాలుడు చెప్పాడు. చాలా సేపు ఇద్దరి మధ్యా వాగ్యుద్దము జరిగిన తర్వాత ఆగ్రహోపేతుడైన పరమ శివుడు త్రిశూలంతో బాలుని తల నరికాడు. బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. అప్పుడే యుద్ధం చేసి ఖండించి తీసుకువచ్చిన గజాననుడు అనే రాక్షసుని తలను కుమారుడికి అతికించాడు. అప్పటినుంచి వినాయకుడికి గజాననుడు అనే పేరు వచ్చింది.

No comments: