Wednesday, April 30, 2008

అల్లు అర్జున్ "పరుగు"

అల్లు అర్జున్ హీరోగా, షీలా హీరోయిన్‌ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పరుగు. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మిక దినోత్సవమైన మేడే రోజున ఈ చిత్రాన్ని నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. తెలుగు తెరపై విజయానికి చిరునామాగా నిలిచిన క్రేజీ కాంబినేషన్‌తో పరుగు చిత్రం రూపొందడంతో దీనిపై అందరిలోను ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో హీరోగా చేసిన అల్లు అర్జున్ తన తొలిచిత్రం గంగోత్రి నుంచి ప్రతి సినిమాను వైవిధ్యంగా మలుచుకుని విజయాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్‌కు ఇది రెండో చిత్రం. ఆయన తొలిచిత్రం బొమ్మరిల్లు ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం సాధించిన విజయంతో ఈ చిత్రం పేరు భాస్కర్‌కు ఇంటిపేరులా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు సైతం సక్సెస్ చిత్రాల నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఈయన గత చిత్రం బొమ్మరిల్లు సాధించిన విజయం గురించి చెప్పుకున్నాం కదా. ఇలాంటి ఓ అద్భుతమైన కాంబినేషన్‌తో రూపొందిన చిత్రానికి సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ తన గత చిత్రం బొమ్మరిల్లులో ఓ తండ్రి, కొడుకు మధ్య ఉండే సున్నితమైన అంశాన్ని తెరకెక్కించినట్టే ఈ చిత్రంలో ఓ తండ్రి, కూతురి మధ్య సంబంధాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు. తన గత చిత్రం సాధించిన విజయం లాగానే ఈ చిత్రం సైతం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ కెరీర్‌లో మరో ఉత్తమ చిత్రంగా భావిస్తున్న ఈ చిత్రం ఆడియోను అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ఆడియోను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇలాంటి అనేక ప్రత్యేకతలున్న ఈ చిత్రం గురువారం నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సందడి చేయనుంది.

No comments: