Monday, September 17, 2007

అమెరికాలో "హ్యాపీడేస్","చిరుత"ల "ఢీ".




టాలీవుడ్ లో క్రేజీని సమకూర్చుకున్న రెండు చిత్రాలు అమెరికాలో పోటీ పడనున్నాయి. చిరంజీవి కుమారుడు రాం చరన్ తేజ్ నటించిన "చిరుత", ప్రతిభావంతుడైన దర్శకుడు శేఖర్ కమ్ముల నూతన చిత్రం "హ్యాపీడేస్" చిత్రాలు అమెరికాలో ఒకేరోజు విడుదల అవుతున్నాయి. అమెరికాలో టాలీవుడ్ హీరో శేఖర్ కమ్ముల. అతని గత చిత్రాలు అమెరికాలో పెద్ద హీరోల చిత్రాల కలెక్షన్లను మించి రికార్డు సృష్టించాయి. "ఆనంద్", "గోదావరి" చిత్రాలు నింపాదిగా సాధించిన కలెక్షన్లను చిరంజీవి చిత్రాలు సహితం అతి కష్టంగా సాధించగలిగాయంటే శేఖర్ కమ్ముల అమెరికా మార్కెట్ స్థాయి ఏమితో తెలుస్తోంది.

ఇక మార్కెటింగ్ పరంగా "హ్యాపీడేస్" చిత్రంపై అమెరికాలో స్పష్టమైన అంచనాలు ఉన్నాయి. అయితే రాం చరన్ తేజ్ నటించిన "చిరుత" చిత్రం పబ్లిసిటీ పరంగా చాలా వెనుకబడి ఉంది. ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అధికారికమైన సమాచారం అమెరికాలో పత్రికలవారికిగానీ, లేక అభిమానులకుగానీ అందుబాటులో లేక పోవడం ఈ చిత్రానికి ప్రస్తుతానికి మైనస్ పాయింట్ గానే చెప్పవచ్చు. నిజానికి "చిరుత" దర్శక, నిర్మాతలు ప్యూహాత్మకంగానే ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీని నిలిపి ఉంచినప్పటికీ, ఇది ఈ చిత్రానికి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది చిత్రం విడుదలవుతేగానీ తెలీదని సినీ పరిశీలకులు అంటున్నారు. కనుక అమెరికాలో ఈ రెండు చిత్రాలమద్యన రసవత్తర పోటీ తధ్యమని తెలుస్తోంది. కాగా, ఇక్కడ దేశవ్యాప్తంగా "చిరుత" చిత్రం ఈ నెల 28న విడుదల అవుతుండగా, "హ్యాపీడేస్" చిత్రం మాత్రం అక్టోబర్ 2న విడుదల అవుతోంది. అమెరికాలో మాత్రం రెండూ ఒకే రోజున, ఈ నెల 28న విడుదల అవుతున్నాయి.
చివరగా చిన్న కొసమెరుపు. గతంలో చిరంజీవి నటించిన "శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్." చిత్రం, శేఖర్ కమ్ముల "ఆనంద్" చిత్రం ఒకేరోజు విడుదలవగా రెండు చిత్రాలూ 100రోజులు పూర్తి చేసుకున్నాయి. కాగా అమెరికాలో "ఆనంద్" చిత్రాన్ని ఎదుర్కోవడానికి చిరంజీవి చిత్ర పంపిణీదారులు చాలా శ్రమపడినట్లు తెలిసింది. మరి ఇప్పుడు ఈ రెండు చిత్రాల పోటీ ఏ చిత్రానికి లాభం చేకూరుస్తుందో, మరే చిత్రాన్ని దెబ్బతీస్తుందో కాలమే చెప్పాలి.

1 comment:

Anonymous said...

జో జీతా వొహీ హై సికందర్