Saturday, September 1, 2007

దర్శకుడు ప్రభుదేవా వల్లే "శంకర్ దాదా జిందాబాద్" చిత్రం ఫెయిల్ అయ్యింది-"జయ టి.వి" ఇంటర్వ్యూలో చిరంజీవి.



"శంకర్ దాదా జిందాబాద్" చిత్ర అపజయానికి దర్శకుడు ప్రభుదేవాయే కారణమని చిత్ర హీరో చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇటీవల "జయ టి.వి" మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ప్రముఖ నటి సుహాసిని చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది.
ఇందులో చిరంజీవి తన జీవిత అనుభవాలను, సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలి నాళ్ళలో చెన్నైలో గడచిన జీవితం, సౌత్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీలో తను, రజినీకాంత్, మోహన్ బాబులు కలిసి చదువుకున్న సంగతులు, చెన్నై పాండీ బజార్ ముచ్చట్లు, పానగల్ పార్క్ కబుర్లు అన్నీ కూలంకశంగా చర్చించిన ఈ ఇంటర్వ్యూలో "శంకర్ దాదా జిందాబాద్" చిత్రం ఫెయిల్ కావడానికి దర్శకుడు ప్రభుదేవా కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఒక హిందీ చిత్రాన్ని మరో ప్రాంతీయ భాషలోకి మార్చుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపట్ల ప్రభుదేవా పూర్తి జాగ్రత్త వహించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో హీరోయిన్ పరిస్థితి మరీ దారుణమని, ఒక విధంగా ఈ సినిమా ఆమెకు యాక్టింగ్ స్కూల్ లా మారిందనే అభిప్రాయాన్ని నటి సుహాసిని వ్యక్తం చేసింది. దానికి చిరంజీవి సహితం అవుననే విధంగా స్పందించారు. ఇక తన 150వ చిత్రంగూర్చి వచ్చిన చర్చలో "ఉయ్యలవాడ నరసిం హా రెడ్డి" కథను అదే పేరుతో తన భార్య సురేఖ నిర్మాణంలో నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి తను దర్శకత్వం వహిస్తున్నానని వస్తున్న వార్తలపట్ల "ఇంకా దర్శకుడిని ఫైనల్ చెయ్యలేద"ని మాత్రం చెప్పి ఊరుకున్నారు. తన రాజకీయ ప్రవేశం గూర్చి "తనకా ఆలోచనే లేదని" పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం తమిళంలో సాగింది. కా గా చిరంజీవి ఇటీవల విశ్రాంతి కోసం బెంగులూరు వెళ్ళినప్పుడు ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగిందని "జయ టి.వి." తెలిపింది. ఈ ఇంటర్వ్యూ తమిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నట్లు తెలిసింది.

No comments: