Wednesday, October 24, 2007

డాడీ మాటలు నమ్మను, ప్రస్తుతానికి ఢిల్లీలోనే నివాసం:"జీ టీవీ" ఇంటర్వ్యూలో శ్రీజ


ప్రాణభయం ఇంకా పోలేదని శ్రీజ జాతీయ న్యూస్ చానల్ కు చెప్పింది... వివరాలు తండ్రి చిరంజీవికి తన ప్రేమ వ్యవహారాన్ని అనేకసార్లు చెప్పానని, ఆయన పెళ్ళికి అంగీకరించలేదని చిరు తనయ శ్రీజ ఢిల్లీలో జీటీవీ స్టూడియోలో ముఖాముఖ కార్యక్రమంలో చెప్పింది. "నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలమ్మా"అంటూ చిరంజీవి టీవీల, పత్రికా ముఖంగా చేసిన ప్రకటనను తాను పూర్తిగా నమ్మడం లేదని శ్రీజ చెప్పింది. శిరీష్ బ్రాహ్మణుడు కావడం, మధ్యతరగతి వ్యక్తి కావడం వల్లనే తన తండ్రి తమ ప్రేమకు అడ్డు తగిలారని ఆమె స్పష్టం చేసింది. ఇంట్లో వారిని ధిక్కరించి ప్రేమ పెళ్ళి చేసుకున్న అబ్బాయిలను ఆమ్మాయి తరఫు వారు కిడ్నాప్ చేసి చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయని శ్రీజ చెప్పింది. అందువల్ల తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపింది. మీ బాబాయి పవన్ కళ్యాణ్ నుంచి ప్రాణభయం ఉందా అని ప్రశ్నించగా దాని గురించి ఆలోచించలేదని, ఇక మీదట తమ ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని చెప్పింది. ఈ టీవీ కార్యక్రమంలో శ్రీజతో పాటు పాల్గొన్న ఆమె భర్త శిరీష్ భరద్వాజ్ ఇంకా తెలివిగా మాట్లాడాడు. తమ పెళ్ళి గురించి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడాలనుకున్నానని, కానీ వారు ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. శ్రీజను ఏడాదిగా గృహ నిర్బంధంలో ఉంచడం, ఆమె పెళ్ళి సంబంధాలు చూడడం వంటి పరిణామాల నేపధ్యంలో ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాడు. తమ ప్రాణాలకు రక్షణ ఉంటుందన్న నమ్మకం పూర్తిగా వచ్చిన తర్వాతే హైదరాబాద్ వెళ్తామని, అప్పటి వరకు ఢిల్లీలోనే ఉంటామని అతను తెలిపాడు.

No comments: